రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక కన్నీరుపెడుతుంటే ఎమ్మెల్యేలు ఏసి గదుల్లో తింటున్నారని పవన్ విమర్శించారు. 150మంది వైసిపి ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడును తింటున్నారని ఆయన మండిపడ్డారు.
గతంలో నేతలంతా ఓట్ల కోసం పాదయాత్రలు చేశారనీ కానీ రైతుల కన్నీరు తుడిచేందుకు నేడు పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఉందనీ అన్నారు. లోతుగా విశ్లేషణ చేసి రైతుల సమస్యలపై ప్రణాళికలు చేయాలన్నారు. తనకు నిజాలు చెబితే విజిలెన్స్ దాడులు ఉంటాయని రైస్ మిల్లర్లకు వైసిపి నేతలు బెదిరించారని పవన్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తన పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వం భయపడిందనీ, అందుకే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 80 కోట్ల రూపాయలను ప్రభుత్వం అర్థరాత్రి విడుదల చేసిందన్నారు. ఏ ప్రభుత్వమైనా రైతుల కడుపు కొడితే కాలిపోవాల్సిందేనని పవన్ హెచ్చరించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వహరిస్తోందని ఆరోపించారు. రైతులకు తాను అండగా ఉంటాననీ, న్యాయం జరిగే వరకూ పోరాడతాననీ పవన్ స్పష్టం చేశారు.
ముందుగా పవన్ రైతులు సమస్యలు తెలుపుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉండటంతో రైతుల సమస్యలు చెప్పడానికి ఇబ్బంది కల్గింది. ఈ క్రమంలో జనసేనికులపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికుల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే ఎన్నికల్లో ఓడిపాయమని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పవన్ సూచించారు.