అమరావతి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి పవన్ బహిరంగ లేఖ రాశారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వంద రోజులు సమయం ఇవ్వాలని తమ పార్టీ తొలుత భావించిందనీ, అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అనేక విజ్ఞప్తులు జనసేనకు అందినప్పటికీ ఇప్పటి వరకూ సంయమనం పాటించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అర్ధాకలితో పడుతున్న బాధలు చూసిన తరువాత లేఖ రాయడం తప్పలేదని పవన్ అన్నారు. గత కొద్ది రోజులుగా మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయానికి భవన నిర్మాణ కార్మికుల నుండి
వినతి పత్రాలు వచ్చాయనీ, కొందరు కార్మికులు స్వయంగా వచ్చి తాము పడుతున్న ఇబ్బందులను, బాధలను తెలియజేసి కన్నీళ్లు పెట్టుకున్నారని పవన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి ఇసుకపై ప్రభుత్వ పాలసీ తీసుకువస్తామన్నారనీ, అప్పటి వరకూ కూలీ, నాలీ పనులు చేసుకునే వారి పరిస్థితి ఏమిటని పవన్ ప్రశ్నించారు. పనులు లేక కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందనీ, ఇది రాష్ట్రానికి క్షేమం కాదని పవన్ అన్నారు. వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ అవకతవకలపై తాను అనేక సందర్భాలలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ కొత్త ఇసుక మైనింగ్ పాలసీ ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇచ్చేలా ఉండకూడదనీ పవన్ విజ్ఞప్తి చేశారు. ఇళ్లు నిర్మించుకునే ప్రజలు, కాంట్రాక్టర్లు, కార్మికులకు అనుకూలంగా కొత్త ఇసుక పాలసీ ఉంటే జనసేన కూడా మద్దతు తెలియజేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
కొత్త ఇసుక పాలసీ రావడానికి ఇంకా కొంత సమయం ఉన్నందున తక్షణం భవన నిర్మాణ కార్మికుల భృతికి భరోసా కల్పించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.