(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతే ఏపి శాశ్వత రాజధానిగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిదు కోట్ల మంది ప్రజలకు, రాజధాని ప్రాంత రైతులకు ఈ విషయంపై స్పష్టమైన మాట ఇస్తున్నానని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజధాని అమరావతి నుండి తరలివెళ్లకుండా జనసేన, బిజెపి నేతృత్వంలో బలమైన కార్యాచరణ ప్రకటిస్తామనీ, ఎలా ముందుకు వెళతామనే విషయాన్ని తెలియజేస్తామన్నారు. రాజధాని తరలింపు అంత ఈజీ కాదని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీలో అమరావతి అంశంతో పాటు అనేక విషయాలపై చర్చించామన్నారు. అమరావతిలో మహిళపై జరిగిన దాడుల విషయం కూడా చర్చకు వచ్చిందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్రం సమ్మతి లేదని స్పష్టం చేశారు. వైసిపి నాయకులు కేంద్రానికి చెప్పి చేస్తున్నామని చెబుతున్న మాటలు అబద్దాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రణాళికతో పాలన కొనసాగించాలనీ, లేకుండా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయనీ పవన్ హెచ్చరించారు.
కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగానే వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని కన్నా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నా ఈ ప్రభుత్వం రాజకీయం మీద శ్రద్ద చూపిస్తూ పరిపాలన పట్టించుకోవడం లేదని విమర్శించారు. చెన్నై, విశాఖపట్నం కారిడార్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రాజకీయమే ప్రధాన అంశంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తున్నదని విమర్శించారు. సాయంత్రం జరిగే జనసేన, బిజెపి కూటమి సమావేశంలో రాజధాని తదితర సమస్యలపై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.