అమరావతి: వైసిపిలోని కాపు ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అంటే భయపడుతున్నారేమోనని ఒక పెద్దాయన తనతో అన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసిపిలోని కాపు ఎమ్మెల్యేలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తాను రాజోలులో ఒక పెద్దాయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన గొడ్డలిలో దూరిన కర్ర..కులాన్నంతా కొట్టేస్తుందని అన్నారని చెప్పారు. అదే మాదిరిగా వైసిపిలో దూరిన కాపు నాయకులందరూ వ్యవహరిస్తున్నారని ఆ పెద్దాయన వ్యాఖ్యానించారని పవన్ అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమనీ, వారికి ఈబిసి రిజర్వేషన్లో కూడా కోటా ఇచ్చేదిలేదనీ జగన్ ఛీకొట్టినా వారంతా ఆ పార్టీలోనే ఉన్నారంటే వారి గురించి ఏమనుకోవాలో తనకు తెలియడం లేదని పవన్ అన్నారు. కాపుసామాజికవర్గం బలంతో దాదాపు 24మంది నాయకులు గెలిచారనీ, ఇప్పుడు వారు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదనీ పవన్ వ్యాఖ్యానించారు. టిడిపి మీద వీరు ఎగిరెగిరిపడేవారు కదా వైసిపి మీద ఎందుకు ఎగిరెగిరి పడటం లేదని తాను ఆ పెద్దాయనను అడిగితే జగన్ రెడ్డి అంటే భయమేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పవన్ తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తాము ముందుకు తీసుకువెళతామని గతంలో చెప్పిన వీరు ఇప్పుడు మాట్లాడటం లేదంటే ఆ భయంతోనే మాట్లాడటం లేదని మనం అనుకోవాలని పవన్ అన్నారు.