(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైసిపి ప్రభుత్వం తక్షణం తెరదించాలని ఆయన సూచించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళల్ని, వృద్ధులను పోలీసు స్టేషన్లకు తరలిస్తున్న తీరు ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. గత రెండు మూడు రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతుల విషయంలో చోటుచేసుకొంటున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అవకాశాలకు ఇలాంటి చర్యలు దెబ్బతీస్తాయని పవన్ పేర్కొన్నారు. అరెస్టులు, నిర్బందాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఆ ఉద్యమమం మరింత ఉదృతం అవుతుందనే విషయం ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణం మానుకొని రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.