(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: భూదందాల కోసమే వైసిపి మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గురువారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చామని చెబుతున్న వైసిపి వాదనలో నిజం లేదని మరో సారి స్పష్టం చేశారు. వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారంపై తాను బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ దృష్టికి తీసుకురాగా ఆయన ప్రధాని మోది, హోంశాఖ మంత్రి అమిత్షాతో మాట్లాడి వారి అనుమతి తీసుకోలేదని చెప్పారన్నారు. కేవలం వైసిపి వారి స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల ప్రకటన చేసిందని విమర్శించారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసిపి అవాస్తవ ప్రచారాన్ని జనసేన, బిజెపి ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన – బిజెపి సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా విజయవాడలో ఫిబ్రవరి రెండున లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సునీల్ ధియోధర్ మాట్లాడుతూ వైసిపి అధికార ప్రతినిధులు, నేతలు కేంద్రంతో అన్నీ చెప్పి చేస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన, బిజెపి ఉమ్మడి పోరాటాలను సాగిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి, వైసిపి రెండు తమకు ప్రత్యర్ధులేనని స్పష్టం చేశారు.