అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అయోమయం, గందరగోళం నెలకొందనీ ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ..కమిటీ నివేదకపై కేబినెట్లో సమగ్రంగా చర్చిస్తామని మంత్రులు ప్రకటించారనీ, మంత్రివర్గం నిర్ణయం తరువాత ఈ విషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి పార్టీ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడం, తద్వారా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంపొందించేదిగా ఉండాలని జనసేన ఆశిస్తోందన్నారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలనో లేక నాలుగు భవనాలుగానో జనసేన భావించడం లేదని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల తక్షణ అభివృద్ధిని, రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుకుంటోందని పవన్ పేర్కొన్నారు.