(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. నగరంలోని జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ నివాసంలో పవన్ పరామర్శించారు.
పవన్ పర్యటన నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. స్థానిక వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందుగా విశాఖ విమానాశ్రయం నుండి పవన్ కాన్వాయ్ వెంట బయలుదేరిన జనసేన నేతల వాహనాలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. తుని, పత్తిపాడులలో కొందరు నేతలను అడ్డుకొని పరిమిత సంఖ్యలో వాహనాలను పవన్ కాన్వాయ్ వెంట అనుమతించారు.
పవన్ పర్యటనను అడ్డుకోమని, అరెస్టు కూడా చేయమని ఎస్పి నయిం హస్మీ ముందుగానే స్పష్టం చేశారు. పవన్ పర్యటన ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగిన ఘటనపై వీడియో పుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేస్తున్నామని వెల్లడించారు.