(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం అయన పర్యటించారు. ఈ సందర్బంగా మహిళలు తమ గోడు ను పవన్ కళ్యాణ్ కు వివరించారు. రెండు నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామనీ, పంట పొలాలు ప్రభుత్వానికి ఇచ్చి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాలు తీసుకోమని ఎవరినీ అడగలేదన్నారు. బిజెపి అమరావతికి అనుకూలమని చెప్పినా కేంద్రం తీరు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. రైతులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ భూములు ఇచ్చి రైతులు నష్ట పోయారన్నారు.
బిజెపితో పొత్తు సమయంలో కూడా తాను రైతులకు న్యాయం చేయాలని అడిగానని చెప్పారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని అన్నారు. అయితే ఆనాటి ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపే అమరావతిని రాజధానిగా నిర్ణయించాయన్నారు. ఇప్పుడు ఇష్టం వచ్చిన విధంగా మారుస్తామంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఒక వేళ బలవంతంగా తరలించినా, వెనక్కే వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విస్తృత అధికారంతో కేంద్రం కూడా వెంటనే స్పందించలేదని పవన్ అన్నారు. ఐదేళ్లకొకసారి రాజధాని మారుస్తామంటే మంచిది కాదని పేర్కొన్నారు.
వైసిపి అనుకూలంగా ఉన్నవారినే సిఎం వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. వారు మూడు రాజధానులకు మద్దతు పలికారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానికి రావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆహ్వానించామనీ, ఢిల్లీ ఎన్నికల వల్ల ఆ రోజు పర్యటన వాయిదా పడిందని చెప్పారు. త్వరలో జనసేన, బిజెపి నాయకులు అమరావతిలో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. బిజేపి రెండోసారి అధికారంలోకి రాగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు వచ్చాయి కానీ జగన్ ప్రభుత్వం తీరుతో అవి వెనక్కి వెళ్లిపోయాయన్నారు.
బిజెపి వేరు, భారతదేశ ప్రభుత్వం వేరు అంటూ అమరావతికి అండగా ఉంటామని బిజెపి జాతీయ నేతలు కూడా తనకు చెప్పారని పవన్ వెల్లడించారు. 90 శాతం భూములు ఇచ్చాక రాజధాని మార్చడం అన్యాయమని అన్నారు. రాజధాని తరలింపు వివాదానికి చంద్రబాబు, జగన్దే బాధ్యత అని పేర్కొన్నారు. రాజధాని భూములను ఇళ్లస్థలాలకు ఇస్తామనడం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని రైతులు తమ భూములను నవరత్నాల కోసం ఇవ్వలేదని అన్నారు. అమరావతిని కదిలించే శక్తి జగన్కు లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి బిజెపి, జనసేన కట్టుబడి ఉన్నాయనీ . రాజధాని అమరావతిగా ఉంటుందని ఒప్పందం రాసుకున్నామనీ చెప్పారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదనీ, బిజెపి, జనసేన అండగా ఉంటుందనీ పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.