కర్నూలు: సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాడతామనీ, హెచ్ఆర్సిని కూడా ఆశ్రయిస్తామనీ తెలిపారు. ఎస్ టి బాలికకు అన్యాయం జరిగిపోతే స్పందించని సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పవన్ అన్నారు.
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవడానికి రాజకీయాలే కారణమని పవన్ మండిపడ్డారు. దిశ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్లో జనాలు ఎలా రోడ్లపైకి వచ్చారో ప్రీతి ఘటనపై కూడా అందరూ రోడ్లపైకి వస్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తప్పు చేసిన నిందితులకు శిక్ష పడాల్సిందేనని పవన్ స్పష్టం చేశారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన చోట విద్యార్థినులపై అత్యాచారాలు జరిగితే సమాజం ఎటుపోతున్నట్టు అని అయన ప్రశ్నించారు. సుగాలి ప్రీతి అంశాన్ని సామాన్యులే తెరపైకి తెచ్చారని తెలిపారు.
ప్రీతి కేసు సీబీఐ విచారణకు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. జగన్రెడ్డి ఎన్ని చట్టాలు తెచ్చినా సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు అవన్నీ వ్యర్థమని పవన్ పేర్కొన్నారు. ప్రీతికి న్యాయం చేయాలని డీజీపీకి, ఎస్పీని వేడుకుంటున్నానని పవన్ తెలిపారు.
కర్నూలు జుడీషియల్ క్యాపిటల్ సంగతి తర్వాత ముందు సుగాలి ప్రీతికి న్యాయం చేయండని సిఎం జగన్ కు సూచించారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే న్యాయ రాజధాని కట్టినా నిష్ప్రయోజనమని అన్నారు. రాయలసీమ బిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు స్పందించడంలేదని పవన్ ప్రశ్నించారు.