అమరావతి: సమర్థత లేని నాయకుల వల్లే జనసేన పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు స్వార్ధం అనేది లేదని అన్నారు. ఒక వేళ స్వార్థమే ఉంటే పది మందిని తీసుకువెళ్లి ఏదైనా పార్టీలో కలిసేవాడినని పవన్ వ్యాఖ్యానించారు. 2014లోనే పార్టీని టిడిపిలో కలపమని కొందరు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని పవన్ గుర్తు చేశారు. సమాజం విచ్ఛిన్నం అవుతుంటే చూసి తట్టుకోలేక సమాజానికి మంచి జరగాలన్న ఆశయాలతో పార్టీని ప్రారంభించానని పవన్ చెప్పారు. ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు పవన్ సూచించారు. కేవలం ఆశయ బలంతో జనసేన పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఏదో ఒక రోజు దేశం మన వైపు చూసేలా చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిదైందనీ, దీని వల్ల ఎవరు తన వాళ్లో అర్థమైందని పవన్ పేర్కొన్నారు.
తిత్లీ తుఫాను సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలోనే ఉన్నా పట్టించుకోలేదని పవన్ విమర్శించారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా మద్యపాన నిషేదం కుదరని పవన్ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పినట్లు మద్య నిషేదం అమలు చేయలేరని పవన్ అన్నారు. మద్య నిషేదం వల్ల అనర్ధాలు వస్తాయనీ, ప్రజలు కోరుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని పవన్ అన్నారు. మహిళలు వ్యతిరేకించిన ప్రదేశాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని పవన్ సూచించారు. ఫించన్ ఏటా 250 రూపాయలు పెంచుతామని జగన్ ముందే చెప్పాల్సిందనీ, అమలు చేయలేని హామీలు ఇవ్వడమెందుకని పవన్ ప్రశ్నించారు. కష్టసాధ్యమైన హామీలు ఇచ్చి ఉంటే తమ పార్టీ కూడా గెలిచేదని పవన్ అన్నారు. అసెంబ్లీ నిర్వహణ తీరుపై మాట్లాడుతూ ప్రజాసమస్యల ప్రస్తావనే లేదనీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఒక్కటే తక్కువనీ ఒకరికి ఒకరు వేలు పెట్టి చూపించే స్థాయికి ఎదిగారని పవన్ విమర్శించారు.