రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తరచూ ప్రభుత్వ విధానాలను విమర్శించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి పై ప్రభుత్వం, టీటీడీ సానుకూలంగా స్పందించడంతో ఆయన ట్విట్టర్ వేదికగా ధన్యవాదములు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలగించిన 1400 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను రేపటి నుంచి తిరిగి విధుల్లోకి రావాలని సూపర్ వైజర్లకు, కార్మికులకు అధికారుల వర్తమానం అందినట్టు సమాచారం. టీటీడీలో 15 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా, సూపర్వైజర్ లుగా పనిచేస్తున్న 1400 మందిని తొలగిస్తూ ఇటీవల టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించడం అన్యాయమని పవన్ పేర్కొన్నారు. దేశంలో లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదనీ, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలనీ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. టీటీడీ కార్మికుల విషయంలో పవన్ మాట్లాడిన అనంతరం… టీటీడీ తిరిగి ఉద్యోగుల్ని యధావిధిగా విధుల్లోకి తీసుకుంటూ, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ గడువు పొడిగిస్తూ టిటిడి ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
టీటీడీ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 1400 మంది టీటీడీ ఉద్యోగులకు తాత్కాలికంగా అయినా ఉపశమనం కల్గించినందుకు టీటీడీ, ఏపి ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. శ్రీవారికి సేవ చేసే ఏ ఒక్క ఉద్యోగి కూడా కష్టాల్లో పడకూడదనీ, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనీ ఆయన అన్నారు. శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా కొద్దిపాటి వేతనాలకే పారిశుద్ధ్య సేవ చేస్తున్నారని పవన్ వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి, టీటీడీ కి ధన్యవాదములు అయితే తెలిపారు కానీ 1400 మంది కార్మికులకు తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నట్లు టీటీడీ గానీ ప్రభుత్వం గానీ అధికారికంగా ప్రకటించలేదు.