అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ, తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తివేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరో మారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పడం లేదని పవన్ అన్నారు. తెలుగుని మృతభాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో సిఎం జగన్ రెడ్డి చెప్పాలన్నారు. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రధమ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. మాతృభాషని మృత భాషగా మార్చవద్దని పవన్ కోరారు.
‘మా తెలుగుతల్లి’ అని పాడాల్సిన జగన్ రెడ్డి ‘తెలుగుభాష తల్లినే’ చంపేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. భాష సరస్వతిని అవమానించవద్దని పవన్ విజ్ఞప్తి చేశారు.