అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలియజేసింది. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ చేస్తున్న ఆందోళనకు జనసేన మద్దతు ప్రకటించింది. మందడం గ్రామంలో జరుగుతున్న మహాధర్నాలో నాగబాబు,మనోహర్ పాల్గొన్నారు.రాజధాని రైతులకు అండగా ఉంటామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పమన్నారని మనోహర్ వారికి తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ పరిపాలన తీరును తీవ్రంగా విమర్శించారు. జిఎస్ రావు కమిటీ నివేదకను పూర్తిగా బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ భవనాలకు రంగులు వేయించడం తప్ప ఒక్క సిమెంట్ పని కూడా ఎక్కడా చేయలేదని నాదెండ్ల విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు జనసేన వ్యతిరేకం కాదని అన్నారు.మంత్రులు ఒక్కోరకంగా మాట్లాడుతూ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సిఎం జగన్కు అమరావతిపై కనీస అవగాహన లేదని ఆయన మండిపడ్డారు.
భూములు ఇచ్చేస్తామని అంత తేలికగా ఎలా మాట్లాడతారనీ, ప్రతిపక్ష నేతగా నాడు అమరావతికి ఎందుకు మద్దతు తెలిపారనీ నాగబాబు ప్రశ్నించారు. రాజధానిని హైదరాబాద్లా అభివృద్ధి చేయాలని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ జనసేన పోరాటం చేస్తుందని నాగబాబు హామీ ఇచ్చారు. రైతుల కళ్ళ వెంట నీళ్లు రానివ్వవద్దని ప్రభుత్వానికి సూచించారు. రైతుల పోరాటంలో జనసేన భాగస్వామి అవుతుందని చెప్పారు. రాజధాని గ్రామాల్లో రైతులకు ఇచ్చిన హామీలని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని నాగబాబు డిమాండ్ చేశారు. మూడు రాజధానులు పెట్టేందుకు జగన్కు ఎవరు అధికారం ఇచ్చారని జనసేన నేతలతో మహిళా రైతులు ఆవేదనతో అన్నారు.