అమరావతి: ఇసుక సమస్యపై విశాఖలో నవంబర్ మూడవ తేదీన జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా అన్ని రాజకీయ పక్షాల మద్దతును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడగడుతున్నారు. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మనోవేదనతో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. అందులో భాగంగా బుధవారం ముందుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు స్వయంగా ఫోన్ చేసి విశాఖలో నిర్వహించే లాంగ్ మార్చ్లో పాల్గొనాలని కోరగా ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. తదుపరి టిడిపి అధినేత చంద్రబాబు, వామపక్షాల నేతలు మధు, రామకృష్ణ, పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, బిఎస్పి అధ్యక్షుడు సంపత్, లోక్సత్తా అధ్యక్షుడు డివివిఎస్ వర్మ తదితర నేతలతో పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు. లాంగ్ మార్చ్లో తమతమ పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేయగా, పవన్ ఆహ్వానం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
previous post
next post