అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సదుద్దేశంతో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ 13 జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమని రాపాక చెప్పారు. మండలిలో ఆంగ్ల మాధ్యమం బిల్లు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ల బిల్లులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం బిల్లును టీడీపీ అసెంబ్లీలో అనుకూలంగా వ్యవహరించి, మండలిలో వ్యతిరేకించిందని రాపాక విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈ సభలో అందరూ బాగా చదువుకున్నవారే ఉన్నారని, ఇక మరో సభ ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై కూడా రాపాక విమర్శలు చేశారు. మండలిపై టీడీపీ దొంగాట ఆడుతోందని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని ఆరోపించారు. చంద్రబాబు ఎంతసేపటికీ బిట్రిష్ సంప్రదాయం ప్రకారం విభజించి, పాలిస్తారని విమర్శించారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్నారని ఎమ్మెల్యే రాపాక చెప్పారు. రాష్ట్రంలో సీఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీకి 151 మంది సభ్యులు ఉంటే.. మరో ముగ్గురు కూడా ఆయన నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. మండలి రద్దు తీర్మానానికి మొత్తం 154 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పాలన వికేంధ్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని రాపాక స్పష్టం చేశారు.