హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ భావి తరాలకు మేలు జరిగేలా కార్యక్రమాలు ఉండాలన్నారు.ఓట్లు పడతాయా లేదా అనే ఆలోచనతో కాకుండా ప్రజలకు మేలు కలుగుతుందా లేదా అనే యోచనతో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
అవకాశవాద రాజకీయాలు కాకుండా పార్టీ భావజాలానికి అనుగుణంగా పని చేయడమే లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ నెల మూడున జరిగిన లాంగ్ మార్చ్ అపూర్వ విజయానికి పార్టీ ఆలోచన విధానమే కారణమని పేర్కొన్నారు.
తాను బహిరంగంగా ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాననీ, ఇలా మాట్లాడితే ఒక వర్గానికి కోపం వస్తుందనీ, వేరేలా మాట్లాడితే ఇంకో వర్గానికి కోపం వస్తుందనీ భావించి పంథాను మార్చుకోననీ పవన్ స్పష్టం చేశారు. భావితరాల మేలు కోసం ఏమి చేస్తే మంచిదో అదే మాట్లాడతాననీ,మనం ఏం మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడదామనీ అన్నారు.
తెలుగును ప్రాథమిక స్థాయిలోనే బోధన భాషగా స్థానం లేకుండా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. భాషను వదిలేస్తే సంస్కృతి నశించి, సంస్కృతీ మూలాలు అంతరించిపోతాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వారి వారి భాషల్లోనే వెలువడుతున్న ఈ రోజుల్లో మన తెలుగు పాఠశాలల్లో తెలుగు మాధ్యమం లేకపోవడం ఎంత వరకు సమంజసమని పాలకులు గ్రహించాలని అన్నారు.
నది ఉన్నచోట నాగరికత ఉంటుంది. భాష ఉన్నచోట నాగరికత పరిఢవిల్లుతుంది. అందువల్ల ‘మన నుడి – మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పవన్ పేర్కొన్నారు.ఇది నిరంతరాయంగా సాగే పోరాటమని చెప్పారు.
ఇసుక సరఫరా సక్రమంగా, సజావుగా సాగే వరకు జనసైనికులు ఒక కంట కనిపెట్టి ఉండాలనీ, ఇసుక సరఫరాలో అక్రమాలు చోటుచేసుకుంటే పార్టీ దృష్టికి తీసుకురావాలనీ పవన్ సూచించారు.
రాయలసీమలో ‘జనసేన’కు అపారమైన క్యాడర్ ఉందనీ, త్వరలో రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తాననీ పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాన్ని పార్టీ ప్రతినిధులు రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. క్యాడర్ ను సమష్టిగా ఉంచి వారిని ముందుకు నడిపే నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని అన్నారు.నిలకడగా పనిచేసే వారిని రాయలసీమలో గుర్తించాలనీ , కార్యకర్తలను రక్షించుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఉందనీ , వారికి అండగా నిలుద్దామనీ అన్నారు. డిసెంబర్ 15వ తేదీలోగా పార్టీ మండల, పట్టణ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ఈ సందర్భంగా పీఏసీ సభ్యులకు పవన్ ఆదేశించారు.