అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధానిపై మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ప్రకటన అనంతరం రాజధాని ప్రాంత రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో పవన్ను కలిసి తమ ఆందోళన వివరించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు రాజధానిలో ఉండి పరిస్థితి సమీక్షిస్తానని రైతులకు పవన్ హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటన చేపట్టారు.
మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన పవన్ కళ్యాణ్ నవులూరు, కృష్ణాయపాలెం, యర్రబాలెం గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు, నాయకులు పవన్కు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆయా గ్రామాల్లో రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులను జనసేనాని పరిశీలించనున్నారు.
శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలు,ఇతర వర్గాలతో పవన్ సమావేశం కానున్నారు. ఆ భేటీలో రాజధాని ప్రాంత సమస్యలపై స్పందించి ప్రసంగించనున్నారు.