న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఈశాన్య రాష్ర్టాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జపాన్ ప్రధాని షింజో అబే..డిసెంబర్ 15(ఆదివారం) నుంచి 17వ తేదీ వరకు భారత్లో పర్యటించాలి. పర్యటనలో భాగంగా అసోం రాజధాని గువాహటిలో 15వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సమావేశం కావాల్సి ఉంది. అయితే గువాహటిలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో షింజో అబే తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ వెల్లడించారు. పరిస్థితులు అనుకూలంగా మారిన తరువాత, రెండు దేశాలు పరస్పరం అంగీకరించిన తేదీల్లో షింజో అబే భారత పర్యటనకు వస్తారని తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
With reference to the proposed visit of Japanese PM @AbeShinzo to India, both sides have decided to defer the visit to a mutually convenient date in the near future.
— Arindam Bagchi (@MEAIndia) December 13, 2019
ఇప్పటికే బంగ్లాదేశ్ హోంమంత్రి అసద్ జ్జమన్ ఖాన్, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ తమ భారత పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈ ప్రకటన వెలుబడిన ఒక్కరోజు కూడా కాకముందే జపాన్ ప్రధానమంత్రి షింజో అబే కూడా భారత పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిల్లును నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపురల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అసోం అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ణప్తిని కూడా పట్టించుకోకుండా అసోం ప్రజలు ఆందోళన చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సైతం పౌరసత్వ సవరణ చట్టం పట్ల నిరసనను వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఆదేశ మంత్రులు తమ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.