టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కు వచ్చేవారికి సరికొత్త బుల్లెట్ ట్రైన్ స్వాగతం పలకనుంది. అది నిజంగా రైలా.. లేదా బుల్లెట్టా అనిపించడం ఖాయం. ఎందుకంటే, టెస్టు రన్ లోనే అది గంటకు 360 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసిందని ఆ రైలు నిర్వాహకులు జేఆర్ సెంట్రల్ ప్రతినిధులు తెలిపారు. అంటే, ఆ రైల్లో వెళ్తే విజయవాడ నుంచి విశాఖపట్నానికి గంటలో చేరుకోవచ్చన్న మాట. ఎన్700ఎస్ అనేది ఈ రైలు పేరు. అందులో ఎస్ అంటే సుప్రీం అని అర్థం. దీని బరువు తక్కువ కావడంతో ఇంధనాన్ని తక్కువగా వాడుకుంటుంది. భూకంపాలను కూడా తట్టుకునేలా అదనపు భద్రతా ఏర్పాట్లున్నాయని చెబుతున్నారు.
మియబారా, క్యోటో నగరాల మధ్య దీన్ని ప్రయోగాత్మకంగా నడిపి చూసినట్లు సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు ఇంతవరకు సాధించిన వేగంలో ఇదే అత్యధికం అంటున్నారు. అయితే, దీని సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినపుడు మాత్రం గంటకు 285 కిలోమీటర్ల వేగంతోనే నడిపిస్తారట. ఈ రైళ్ల కోసం జేఆర్ సెంట్రల్ దాదాపు రూ. 15 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. జూన్ రెండోవారం నాటికి అత్యధిక వేగంతో ఈ రైలును పరీక్షిస్తారు. 1964లో తొలిసారి టోక్యోలో ఒలింపిక్స నిర్వహించినపుడే జపాన్ లో బుల్లెట్ రైళ్లు వచ్చాయి. ఇవి వేగానికి, దృఢత్వానికి పేరొందినవి. ఈ రైళ్లను ఎగుమతి చేయడానికి జపాన్ సిద్దమవుతోంది. టెక్సాస్, తైవాన్ మధ్య వీటిని నడపాలని జేఆర్ సెంట్రల్ భావిస్తోంది. ఆల్ఫా-ఎక్స్ అనే మరో కొత్త మోడల్ రైళ్లను ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ పరీక్షిస్తోంది. 2030లో వాటిని ప్రవేశపెట్టేసరికి అవి 360 కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి.