(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రెండు రోజుల పాటు తల్లిదండ్రులును విపరీతమైన క్షోభకు గురి చేసిన జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమయింది. బామ్మను కొట్టి నాలుగేళ్ల ఆ పిల్లవాడిని అపహరింకచిన కిడ్నాపర్లు బహుశా భయపడి అతడిని వదిలిపెట్టారు. గురువారం తెల్లవారుఝామున బైక్పై వచ్చి జషిత్ను రాయవరం మండలం కుతుకులూరు రోడ్డులో వదలివెళ్లారు. కిడ్నాప్ జరిగిన మండపేటలోనే కాక రాష్ట్రమంతా జషిత్ క్షేమం గురించి ఆలోచించింది. పిల్లవాడు క్షేమంగా ఇంటికి రావడంతో ఈ రెండు రోజులూ తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పని చేస్తున్న నూక వెంకట రమణ, నాగవల్లి దంపతుల కుమారుడు జషిత్ (4)ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక కార్పోరేట్ స్కూల్లో ఎల్కెజీ చదువుతున్న జషిత్ సోమవారం స్కూల్ నుండి వచ్చిన తరువాత వారి అపార్ట్మెంట్ సమీపంలోని గ్రౌండ్కు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకున్నాడు. రాత్రి 7.30గంటల ప్రాంతంలో నాయనమ్మతో కలిసి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని ఒక వ్యక్తి బైక్పై వచ్చి ఆమెను తోసేసి బాలుడిని బైక్పై ఎక్కించుకొని పరారు అయ్యాడు. ఈ కిడ్నాప్ ఘటన మండపేట పట్టణంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించారు.
జిల్లా ఎస్పి నయీం అస్మి నేతృత్వంలో బాలుడి ఆచూకి కోసం 17 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రసారమాధ్యమాల్లో బాలుడి గురించి విస్తృతంగా ప్రచారం కల్పించారు. బాలుడు ఎక్కడ కనిపించినా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విస్తృత గాలింపు చర్యలతో భయపడిన కిడ్నాపర్లు గురువారం తెల్లవారుఝామున బాలుడిని రాయవరం మండలం కుతుకులూరు రోడ్డులో వదిలిపెట్టి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర బాలుడిని కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. జిల్లా ఎస్పి నయీం స్వయంగా జషిత్ను తీసుకుని వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పి నయీం మాట్లాడుతూ బాలుడు క్షేమంగా ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుంటామని నయీం తెలిపారు. బాలుడిని గుర్తించడంలో సహకరించిన ప్రజలకు, మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.