(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో మళ్లీ అన్యమత ప్రచారం కలకరం రేగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని ఓ చౌక ధరల దుకాణం యజమాని వీటిని అచ్చేయించారు. క్రీస్తు చిత్రంతోపాటు వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని కూడా కార్డులపై ముద్రించారు.
జనం నిత్యం వాడే అంత్యోదయ కార్డులపై ఇలా మతాల ప్రచారం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే క్రైస్తవ మతప్రచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వానికి.. తాజా కార్డుల వివాదం తలనొప్పిగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన అంతటా మతపరమైన కోణంలో సాగుతోందని.. బలవంతంగా మత మార్పిడిలు, అన్యమత ప్రచారం సాగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందని కలకలం రేగింది. ఇదిఇలా ఉంటే.. పంచాయతీ ఆఫీసులకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, శ్మశానాలు, ఆలయాలకు, రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్లకు వైసీపీ రంగులు పూయడం ఇప్పటికే వివాదాస్పమైన సంగతి తెలిసిందే.