బీఫ్ తినడం ఆదివాసీల సంప్రదాయంలో భాగమని ఫేస్ బుక్ పోస్టులో రాసిన రెండేళ్ల తర్వాత ఓ గిరిజన లెక్చరరును ఝార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. పోస్టు పెట్టిన వెంటనే కేసు నమోదైనా, అప్పటినుంచి అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనం ప్రచురించింది. జంషెడ్ పూర్ లోని సాక్షి ప్రాంతంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న జీత్ రాయ్ హంస్డా 2017 మేలో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. జంతు బలులు, బీఫ్ తినడం లాంటివి జోహర్ డాంగ్రి మైదాన్ గిరిజన ఉత్సవంలో భాగమని, అది ‘ఆదివాసీల సాంస్కృతిక హక్కు’ అని రాశారు. గొర్రెలను నరకడానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కూడా అతడు విమర్శించాడని, గిరిజనులు హిందువుల్లా ఎందుకు బతకాలని అడిగాడని కోర్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది.
ఈ పోస్టులకు గాను హంస్డాపై జంషెడ్ పూర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153 ఎ (వివిధ వర్గాల మధ్య శతృత్వం పెంచడం), 295 ఎ (ఒక మతం లేదా మతపరమైన అలవాట్లను అవమానించడం ద్వారా ఆ వర్గం ఆధ్యాత్మిక భావనలను గాయపరిచేలా ఉద్దేశపూర్వక చర్య), 505 (ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు) కింద కేసు పెట్టారు. అతడు చేసిన పోస్టుల వల్ల వివిధ వర్గాల మధ్య అసహనం, శతృత్వం, ద్వేషభావం పెరిగే ప్రమాదముందని చెప్పారు. సాక్షి పోలీసు స్టేషన్ ఇన్ చార్జి అనిల్ కుమార్ సింగ్.. ఈ ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్ల తర్వాత అతడిని ఎందుకు అరెస్టుచేస్తున్నారంటే, చార్జిషీటు దాఖలైనప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడని తూర్పు సింగ్భమ్ సీనియర్ ఎస్పీ అనూప్ బిర్తరీ చెప్పారు.
అయితే, పోలీసులు చెబుతున్న విషయాలను తానింకా నిర్ధరించుకోవాలని మానవహక్కుల చట్ట నెట్ వర్కుకు చెందిన న్యాయవాది షాదాబ్ అన్సారీ అన్నారు. అయితే, హంస్డా ఏప్రిల్ నెలలో పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అతడు పరారీలో ఉంటే ఈ ఉత్తర్వులు అమలుకావని ఆయన చెప్పారు. అంతకుముందు కూడా హంస్డా ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించారు. చట్టపరిధిలో చేసిన విమర్శలు తప్పు కావని, హంస్డా కేవలం తమ వర్గ సంస్కృతిలో ఉన్న ఆహారపు అలవాట్ల గురించే చెప్పాడని ఏప్రిల్ 18 నాటి విచారణలో అప్పటి న్యాయవాది అన్నారు. తమ సాంస్కృతిక హక్కుల మీద దాడి జరగకుండా కాపాడుకునే హక్కు నిందితుడికి ఉందన్నారు.
అయితే, హంస్డా పనిచేస్తున్న కాలేజి అధికారులు, ప్రిన్సిపాల్ కూడా అతడి పోస్టులు వర్గాల మధ్య శతృత్వాన్ని, విద్వేషాన్ని రేకెత్తిస్తాయని జంషెడ్ పూర్ లోని అదనపు సెషన్స్ జడ్జి కోర్టు తెలిపింది. హంస్డాపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలను ఏ వర్గానికి చెందిన సాంస్కృతిక హక్కుల పరిరక్షణలో భాగంగా భావించలేమని వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ నిరాకరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.