(కేంద్ర మంత్రి మహేష్ శర్మ ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి మహేష్ శర్మను బ్లాక్ మెయిల్ చేసినందుకు జర్నలిస్టును అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పటికే తాము ఒక సామాజిక కార్యకర్తను ప్రశ్నించామని, త్వరలో ఒక రిటైర్డ్ పోలీసు అధికారినీ ప్రశ్నిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి మహేష్ శర్మ లంచం తీసుకుంటుండగా ఆ జర్నలిస్టు పట్టుకున్నానని చెప్పి, ఆయన నుంచి రూ. 2 కోట్ల లంచం డిమాండు చేశారు. అయితే, తాను లంచం తీసుకోవడం తప్పని శర్మ కొట్టి పారేశారు. ఈ కేసులో సదరు జర్నలిస్టును కస్టడీకి పంపారు. అరెస్టయిన జర్నలిస్టుతో సామాజిక కార్యకర్త ఉషా ఠాకుర్ మాట్లాడారని, కేంద్ర మంత్రికి.. జర్నలిస్టుకు సమావేశం ఏర్పాటుచేసింది కూడా ఆమేనని పోలీసులు అంటున్నారు.
ఉషా ఠాకుర్ తో పాటు నోయిడా మాజీ డీఎస్పీ కేకే గౌతమ్ కూడా నిందితుడితో మాట్లాడుతున్నారని తెలిసిందని గౌతమ బుద్ధనగర్ సీనియర్ ఎస్పీ వైభవ్ కృష్ణ చెప్పారు. జర్నలిస్టు అరెస్టు తర్వాత ఠాకుర్ ను ప్రశ్నించామని, వారిద్దరితో తన సంభాషణలపై నిందితుడు అన్నీ చెప్పాడని ఆయన అన్నారు. వాటిపై విచారణ కొనసాగిస్తున్నామన్నారు. అయితే ఉషాఠాకుర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ‘‘నా వద్దకు ఎవరు సాయం కోసం వచ్చినా సాయం చేస్తాను. మహేష్ శర్మ నాకు సోదరుడి లాంటివారు. నేను గత రాత్రి 12 గంటల వరకు మహిళా పోలీసు స్టేషనులోనే ఉన్నా. కుట్రను నిమిషాల్లో ఛేదించి పోలీసులు బాగా పనిచేశారు’’ అని ఆమె అన్నారు.
రిటైర్డ్ డీఎస్పీ గౌతమ్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఉషా ఠాకుర్, గౌతమ్ కలిసే జర్నలిస్టును తన వద్దకు తెచ్చారని కేంద్రమంత్రి శర్మ చెప్పారు. తన ప్రచారాలకు వాలంటీరుగా ఉంటానని అతడన్నాడని, అందుకే సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. జర్నలిస్టుకు, కేంద్రమంత్రికి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియో రికార్డింగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అభ్యంతరకరమైనవి ఏమీ లేవన్నారు. ఆ సంభాషణలు రికార్డు చేసిన టాబ్లెట్ ఉషాఠాకుర్ వద్ద తీసుకున్నట్లు జర్నలిస్టు తెలిపారని పోలీసులు చెప్పారు.