ఇవ్వకపోవడం వ్యవస్థాగత పక్షపాతమే
రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల కేసులో.. ఆరోపణలు చేసిన మహిళకు కూడా తప్పనిసరిగా నివేదిక ఇవ్వాలని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. అలా ఇవ్వకపోవడం వ్యవస్థాగతమైన పక్షపాతమే అవుతుందని చెప్పారు. ఆ ఉద్యోగినిని సరిగా విచారించలేదన్నది తన విశ్వాసమన్నారు. ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రికతో ఆయన ప్రత్యేకంగా ఈ విషయాలు పంచుకున్నారు.
కోర్టు అంతర్గత కమిటీ విచారణ నివేదిక కాపీని ఫిర్యాదు చేసిన మహిళకు ఇవ్వాలని, అప్పుడు ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయని జస్టిస్ లోకూర్ చెప్పారు. ఆమెకు నివేదిక కాపీ ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరా జైసింగ్, సుప్రీంకోర్టుల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ నివేదిక కాపీని ఫిర్యాదు చేసిన ఉద్యోగికి ఇవ్వడానికి నిరాకరించారని, ఈ నిర్ణయం సరికాదని తెలిపారు. అంతర్గత కమిటీ అనేది 1999-2000 సమయంలో జడ్జీలు అర్థం చేసుకున్న తరహా ఇన్-హౌస్ విచారణ కమిటీ కాదని అన్నారు. ఒక ఫార్మల్ ఇన్-హౌస్ కమిటీ సందర్భంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సదరు కమిటీ నివేదిక పొందేందుకు ఫిర్యాదుచేసిన మహిళకు అర్హత లేదని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పలేదని గుర్తుచేశారు. ఇన్ హౌస్ విచారణ చేసే ప్రక్రియలో, నివేదిక కాపీని జడ్జికి సమర్పించాలని ఉందని, అంతేతప్ప ఫిర్యాదుచేసిన వారికి ఇవ్వకూడదన్న నిషేధం లేదని జస్టిస్ లోకూర్ గుర్తుచేశారు.
ఇలాంటి విషయాల్లో పారదర్శకత ఉండాలని, నివేదిక సమర్పించిన తర్వాత దాని సంగతి ఏమైందని ఆయన అడిగారు. దాన్ని సంబంధిత జడ్జి ఆమోదించారా? ఆ మేరకు ఆదేశాలున్నాయా? కమిటీ నివేదికతో సంబంధిత జడ్జి విభేదించవచ్చా? అని ప్రశ్నించారు. తన అభిప్రాయంలో మాత్రం సంబంధిత జడ్జి ఆ నివేదికను ఆమోదించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చని, దానిపై చర్యలు తీసుకోవాలనో లేదా వద్దనో చెప్పవచ్చని అన్నారు. ఏదైనా గానీ, ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాలని.. కానీ ఈ కేసులో అలాంటిదేమైనా జరిగిందో లేదో బయటకు చెప్పలేదని గుర్తుచేశారు.