ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్పై మాజీ కోర్టు ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నుండి జస్టిస్ ఎన్వి రమణ తప్పుకున్నారు. ముగ్గురు జడ్జీల కమిటీ విషయంలో బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో గురువారం ఆయన ధర్మాసనం నుండి తప్పుకున్నారు.
సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో త్రిసభ్య కమిటీని కోర్టు ఏర్పాటు చేసిన విషయం విదితమే.
ఈ కమిటీ ముందుకు శుక్రవారం హాజరు కావాలంటూ బాధిత మహిళకు నోటీసులు పంపగా, ఆమె సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ద్వారా న్యాయమూర్తులకు నాలుగు పేజీల లేఖ రాశారు.
విచారణ కమిటీలో జస్టిస్ ఎన్వి రమణను సభ్యుడిగా చేర్చడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తరచు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఇంటికి వచ్చి వెళ్తుంటారన్నారు. ఒక రకంగా ఆయన వారి కుటుంబ సభ్యుడి లాంటివారని పేర్కొంది.
అలాంటి వ్యక్తి సమక్షంలో విచారణ నిష్పక్షపాతంగా, న్యాయంగా జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కమిటీ నుండి జస్టిస్ ఎన్వి రమణ నిష్క్రమించారు.