న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదివిలో బాబ్డే 17 నెలల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. 2021 ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నిన్న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో బాబ్డే నియమితులైన విషయం తెలిసిందే.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ్ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో పాటు పలు కీలక కేసుల్లో తీర్పు వెలువరించిన అయిగురు న్యాయమూర్తుల రాజ్యంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే సభ్యులుగా ఉన్నారు.
జస్టిస్ బాబ్డే మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1956 ఏప్రిల్ 24న జన్మించారు. బిఏ ఎల్ఎల్ఎం విద్యను పూర్తి చేసి 1976లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో సుమారు 21 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పని చేశారు. 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.