(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో ప్రకాశం, గుంటూరు జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో రాజధాని ప్రాంత అమరావతి రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పలు జిల్లాలలో ఆ పార్టీ నేతలు అమరావతి రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలను సైతం వదిలి టిడిపి నేతలు, స్థానికులు భారీగా దీక్షా స్థలికి చేరుకుని నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.
గుంటూరు జిల్లా పొన్నురులో ఎన్జి రంగా సెంటర్లో టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర దంపతులు ఒక రోజు దీక్షకు చేపట్టారు. వీరి దీక్షకు మద్దతుగా పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నాయి.