అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు. గంట పాటు ఈ మౌన దీక్ష కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కన్నా అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రియలెస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే… ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతం మొత్తాన్ని అమ్మేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజధానికి అడ్రెస్ లేకుండా జగన్.. నిలువునా ముంచుతాడని ప్రజలు ఊహించలేదన్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధానిపై జీఎన్ రావు కమిటీని వేయడం, కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్ మూడు రాజధానుల గురించి మాట్లాడటం చూస్తే… ఇదంతా కుట్ర అనే విషయం అర్థమవుతుందని కన్నా వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ మద్దతిస్తుందని, పాలన వికేంద్రీకరణకు ఒప్పుకోదని స్పష్టం చేశారు. రాజధానిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం… అభిప్రాయాలను తీసుకోకముందే ఈరోజు కేబినెట్ మీటింగ్ పెట్టారని కన్నా మండిపడ్డారు. వైసీపీ పాలన ప్రజాస్వామ్యబద్దంగా లేదని… రాష్ట్రాన్ని వారి జాగీరులా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పిన జగన్… రాష్ట్ర ప్రజలకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు. ఇలాంటి రాక్షస పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఏపీ కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కన్నా చెప్పారు.