(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సర్ఫరాజ్ ల మధ్య నడిచిన ఫోన్ సంభాషణ లీక్ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు వ్యతిరేకంగా, సంజయ్ కు అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని అప్పట్లో గంగుల ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ సర్ఫరాజ్ వివరణ కూడా ఇచ్చారు. ఆడియో టేపును ఎడిట్ చేసి లీక్ చేశారని కలెక్టర్ వివరించారు. అప్పట్లోనే సర్ఫరాజ్ పై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినా అలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. తాజాగా ఆయనపై బదిలీ వేటు పడింది.
కరీంనగర్ కు చెందిన మంత్రి గంగులతో పాటు జిల్లాలోని చాలా మంది టీఆర్ఎస్ నేతలతో కలెక్టర్కు విభేదాలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తోనూ కలెక్టర్ సర్ఫరాజ్కు వాగ్వాదం జరిగింది. మునిసిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కలెక్టర్ బదిలీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మూడేళ్లు దాటిపోయినందునే బదిలీ చేశామంటున్నాయి. కరీంనగర్ కలెక్టర్గా శశాంకను నియమించారు. శశాంక ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటు సర్ఫరాజ్ అహ్మద్ను ఎక్సైజ్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
2016 అక్టోబరు 11 నుంచి ఇప్పటి వరకు సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల తర్వాత నుంచి జిల్లా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, ఇటీవలే మంత్రి అయిన గంగుల కమలాకర్ తో పాటుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయన పరితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. కలెక్టర్ పై గతంలో కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకవెళ్లినా అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. కొంత కాలంగా కలెక్టర్ వ్యవహారంపైన అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్.. సంజయ్కుమార్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపైన పూర్తి సమాచారం సైతం కోరింది. మంత్రి గంగులపై అనర్హత కేసు వేసేందుకు కలెక్టర్ సంజయ్కి సహకారం అందించారనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్న ఈ ఫోన్ సంభాషణపైన సీఎం ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం సాగింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ వివరణ అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.