బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17 మంది శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే.
17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా అందులో మస్కీ, రాజరాజేశ్వరి నియోజకవర్గాల ఎన్నికకు సంబందించిన పిటిషన్ హైకోర్టు విచారణ లో ఉండటం తో 15 అసెంబ్లీ స్థానాలకే ఉప ఎన్నిక జరుగుతున్నది.15 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి , కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఉప ఎన్నికల సందర్భంగా బెంగళూరు పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.
అతానీ, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, రాణిబెన్నూర్, విజయనగర, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతోంది.