బెంగళూరు: కర్నాటక శాసనసభ లో కుమారస్వామి ప్రభుత్వం పై విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి ఓటింగ్ జరగకుండానే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. గవర్నర్ ఇచ్చిన మొదటి గడువు మధ్యాహ్నం 1. 30గంటలకు , తరువాత సాయంత్రం ఆరు గంటలకు ముగిసిపోయింది. తర్వాత సభలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. సోమవారం తప్పనిసరిగా విశ్వాసపరీక్షకు కూర్చుంటానని ముఖ్యమంత్రి మాట ఇచ్చిన తర్వాత స్పీకర్ రమేర్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
కర్నాటక గవర్నర్ ఇచ్చిన రెండవ గడువు కూడా దాటిపోయిది. శాసనసభలో కుమారస్వామి విశ్వాసపరీక్షపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ ఉత్కంఠకు ఈరోజే తెర పడే సూచనలు ఉన్నాయి. చాలా చర్చ జరిగింది. ఇక ఈ రోజే దీనిని ముగించాలి అని స్వయంగా స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.
మరోపక్క ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాసనసభకు డెడ్లైన్ పెట్టే అధికారం గవర్నర్కు లేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభ్యులకు విప్ జారీ చేసే అధికారాన్ని కోల్పోయిందనీ, దానిపై స్పష్టత ఇవ్వాలనీ ఆయన కోరారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు గుండూరావు కూడా విప్ విషయంలో సుప్రీంకోర్టులో విడిగా పిటిషన్ దాఖలు చేశారు.
(2 00 గంటలు) అంతకుముందు:
గడువు తీరిపోయింది. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంకా ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. అసెంబ్లీలో విశ్వాసపరీక్ష ఇంకా తెగలేదు. విశ్వాసపరీక్ష కోసం గవర్నర్ విజూభాయ్ వాలా పెట్టిన గడువును ఖాతరు చేయరాదని కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణం నిర్ణయించుకుంది. విశ్వాస తీర్మానంపై చర్చ పూర్తి కాకుండా దానిని వోటింగ్కు తీసుకువెళ్లలేనని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. దీనితో వెంటనే విశ్వాసపరీక్షపై వోటింగ్ జరగాలని పట్టుపడతున్న బిజెపి సభలో తీవ్ర గందరగోళం సృష్టించింది. ఫలితంగా స్పీకర్ సభను మూడింటి వరకూ వాయిదా వేశారు. గడువులోగా సభ విశ్వాసం పొందాలన్న గవర్నర్ ఆదేశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని స్పీకర్ పేర్కొన్నారు. తన విధుల నిర్వహణలో గవర్నర్ గానీ, సుప్రీంకోర్టు గానీ తనను నియంత్రించలేరని స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ విజూభాయ్ను కలిసేందుకు స్పీకర్ సమయం కోరారు.