మైసూర్: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరో సారి తన అసహనాన్ని ప్రదర్శించారు. మైసూర్ విమానాశ్రయంలో తన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. ఈ ఘటన కెమెరాలకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే సిద్దరామయ్య ఎందుకు తన సహాయకుడిపై చేయి చేసుకున్నాడన్నది ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సహయకుడు తన సెల్ ఫోన్ను సిద్దరామయ్య చెవి దగ్గర పెడుతూ వ్యక్తితో మాట్లాడమని చెప్పేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికే చిరాకుగా ఉన్న సిద్ధరామయ్య కాసేపు అతడి వైపు చూసి అందరి ముందే బలంగా చెంప చెళ్లుమనిపించి నింపాదిగా అతడిని నెడుతూ తన వాహనం వైపుకు అడుగులు వేశారు.
సిద్దరామయ్య వ్యక్తులపై చేయి చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్తను దూషిస్తూ చేయి చేసుకున్నారు. రెవెన్యూ శాఖకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడటం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆమె నుండి మైక్ లాక్కునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నించిన సమయంలో మైక్తో పాటు ఆమె చీరకొంగు కూడా రావడం, ఆమెపై కేకలు వేస్తూ కూర్చోమని చెప్పడం రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనను పురస్కరించుకొని బిజెపి నేతలు ఆయన్ను దుశ్సాసనుడిగా అభివర్ణిస్తూ విమర్శలు కూడా చేశారు. ఎక్కువ సేపు మాట్లాడుతున్నందున ఇక చాలని చెప్పేందుకు తాను మైక్ లాక్కున్నాననీ, ఆమె తనకు సోదరి లాంటిదంటూ సిద్దరామయ్య వివరణ ఇచ్చారు.
#WATCH: Congress leader and Karnataka's former Chief Minister Siddaramaiah slaps his aide outside Mysuru Airport. pic.twitter.com/hhC0t5vm8Q
— ANI (@ANI) September 4, 2019