బెంగళూరు: రాష్ట్రంలో యదియూరప్ప నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ సిఎం కుమారస్వామి స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వానికి తమ పార్టీలోని కొందరు బయట నుండి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ తరహా అసత్య వార్తలను బిజెపియే పనిగట్టుకొని ప్రచారం చేస్తోందని కుమార స్వామి ఆరోపించారు.
బిజెపి ప్రభుత్వానికి వెలుపలినుంచి మద్దతు ఇవ్వాలని కొందరు ప్రతిపాదించారనీ అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి జిటి దేవగౌడ ఎన్డిటివితో చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.
ఈ వార్తలను మాజీ ప్రధాని దేవగౌడ కూడా ఖండించారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ, ప్రాంతీయ పార్టీగా వ్యతిరేకించాల్సిన చోట వ్యతిరేకిస్తామనీ, రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలు బిజెపి ప్రభుత్వం తీసుకున్న సమయంలో స్వాగతిస్తామని పిటిఐ వార్తా సంస్థతో మాజీ ప్రధాని దేవగౌడ అన్నారు.