బెంగళూరు: కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జీ. పరమేశ్వర పర్సనల్ అసిస్టెంట్ రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం బెంగళూరులోని జ్ఞానభారతి ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరమేశ్వర ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.
గత రెండు రోజులు జీ. పరమేశ్వర ఇల్లు, ఆయనకు సంబంధించిన విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.4.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలతో పాటుగా.. ఆయన వ్యక్తిగత సహాయకుడు రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై కూడా సోదాలు చేశారు. అయితే, ఐటీ దాడులు జరిగిన మరుసటి రోజే రమేష్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు రమేష్ ఆత్మహత్యపై పరమేశ్వర మాట్లాడుతూ..‘ ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో రమేష్ నాతోనే ఉన్నాడు. ఏమీ జరగదని, చింతించవద్దని నేను అతనికి చెప్పాను. రమేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నాకు తెలియదు. ఇలా జరగడం దురదృష్టకరం’ అని అన్నారు.
Former Deputy CM of Karnataka, G Parameshwara's Personal Assistant, Ramesh (in pic) has allegedly committed suicide in Gnana Bharathi area of Bengaluru. More details awaited. pic.twitter.com/2r6cCOvVBr
— ANI (@ANI) October 12, 2019
మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, కాంగ్రెస్ నేత ఆర్.ఎల్.జాలప్పల నివాసాలపై ఐటి అధికారులు గురువారం, శుక్రవారం ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు చేయడంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తారు. బెంగళూరు, తుమకూరు సహా మొత్తం 30 చోట్ల సోదాలు చేశారు. పరమేశ్వర కుటుంబం సిద్ధార్థ గ్రూప్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థలను పరమేశ్వర తండ్రి హెచ్ఎం గంగాధరయ్య 58 ఏళ్ల క్రితం స్థాపించారు. పరమేశ్వర నివాసం, తుమకూరులోని సిద్ధార్థ మెడికల్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంలో కోట్లాది రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 300 మంది ఐటీ సిబ్బంది ఇద్దరు కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 30 ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. సిద్ధార్థ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని రెండు మెడికల్ కాలేజీల్లో నిర్వహించిన నీట్ పరీక్షల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే.. రమేష్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. ఈ ఐటీ సోదాలు ఏ మలుపు తిరగబోతున్నాయో వేచి చూడాలి.