న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతున్న కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బలపరీక్ష జరిగే శాసనసభ సమావేశానికి తిరుగుబాటు శాసనసభ్యులు తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు రూలింగ్పై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోపక్క కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తాను ఇచ్చిన గడువును గవర్నర్ వజూభాయ్ వాలా పొడిగించారు. బలపరీక్ష ఈరోజే ముగిసిపోవాలనీ, శుక్రవారం సాయంత్రం ఆరు గంటల లోపు సభ విశ్వాసం పొందాలనీ ఆయన తాజాగా ముఖ్యమంత్రిని ఆదేశించారు. రాజ్యాంగం రీత్యా అది తప్పదని ఆయన పేర్కొన్నారు. సభలో దీర్ఘమైన చర్చలు విశ్వాసపరీక్ష జాప్యం చేసేందుకే జరుగుతున్నాయని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ దగ్గర నుంచి వచ్చిన రెండవ ప్రేమలేఖ తనను బాధించిదని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు రూలింగ్ కారణంగా కాంగ్రెస్ హక్కులకు భంగం వాటిల్లిందని తన పిటిషన్లో కుమారస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులకు విప్ జారీ చేసే అధికారం లెజిస్లేచర్ పార్టీకి ఉంటుందనీ, తిరుగుబాటు సభ్యులు సభకు హాజరవ్వాల్సిన అవసరం లేదన్న కోర్టు నిర్ణయం కారణంగా పార్టీ ఆ అధికారాన్ని కోల్పోయిందనీ ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ముందున్న కేసులో కాంగ్రెస్ పార్టీ కక్షిదారుడు కాదనీ అయినప్పటికీ కాంగ్రెస్ హక్కులకు భంగం కలిగే రూలింగ్ వచ్చిందనీ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈరోజు మధ్యాహ్నం 1 :30 గంటల లోపు విశ్వాసపరీక్ష జరగాలని ముఖ్యమంత్రికి గవర్నర్ విధించిన గడువు తీరినప్పటికీ సభలో వోటింగ్ జరగలేదు. విశ్వాస తీర్మానంపై చర్చ పూర్తి కాకుండా దానిని వోటింగ్కు తీసుకువెళ్లలేనని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
గడువులోగా సభ విశ్వాసం పొందాలన్న గవర్నర్ ఆదేశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని స్పీకర్ పేర్కొన్నారు. విధుల నిర్వహణలో గవర్నర్ గానీ, సుప్రీంకోర్టు గానీ తనను నియంత్రించలేరని స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ వజూభాయ్ను కలిసేందుకు స్పీకర్ సమయం కోరారు.
గవర్నర్ తాజా గడువు వల్ల కూడా కర్నాటక ప్రతిష్టంభనలో మార్పు వచ్చే సూచనలు కనబడడం లేదు. గడువులోగా విశ్వాసపరీక్షపై వోటింగ్ తమ చేతిలో పనికాదనీ, సభ నిర్వహణ పూర్తిగా స్పీకర్ చేతిలో ఉంటుంది కాబట్టి తాము ఆయనను నియంత్రించలేమనీ సంకీర్ణం నాయకులు అంటున్నారు. తన విధిలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని స్పీకర్ అంటున్నారు.