హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చింది గాలి పిటిషన్లు కాబట్టే స్పీకర్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్ లో చేరలేదన్న కేసీఆర్.. రాజ్యాంగబద్దంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం అయ్యారని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అన్నారు. ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందని సభలో సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
గోవాలో 10 మంది కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారన్నారు. రాజస్థాన్లో బీఎస్పీ సభ్యులను కాంగ్రెస్ చేర్చుకుందని తెలిపారు. గత ప్రభుత్వాల పాలన కంటే టీఆర్ఎస్ పాలన ఎన్నో రెట్లు బాగుందని ప్రజలు అంటున్నారని సీఎం చెప్పారు. తమపై ప్రజలపై నమ్మకం ఉందన్న కేసీఆర్.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచామన్నారు. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.