తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు. ముందస్తు ఎన్నికలలో అఖండ విజయం సాధించి రెండవ సారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తర్వాత కెసిఆర్ ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కాగానే దేశంలో కాంగ్రెస్, బిజెపిలతో నిమిత్తం లేకుండా ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అవుతున్న నేపధ్యంలో ప్రధానితో కెసిఆర్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కెసిఆర్ ఆయనతో సమావేశమయ్యారు. సుమారు 40 నిముషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రాజకీయ అంశాలపై కూడా ఇద్దరి మధ్యా చర్చలు జరిగినట్లు సమాచారం.
వినతిపత్రంలోని కొన్ని ముఖ్యాంశాలు.
హైదరాబాద్లో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి బైసన్ పోలో భూములు ఇవ్వాలి.
కరీంనగర్లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
కృష్ణా జలాల పంపకంలో తెలంగాణాకు అన్యాయం జరుగుతున్నందున నదీ జలాల వివాదం పరిష్కరించేలా చొరవ చూపాలి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.
రాష్ట్ర విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే నెలకొల్పాలి.
కొత్తగా ఏర్పాటయిన జిల్లాలలో నవోదయ విద్యాలయాలను నెలకొల్పాలి.