హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రాలు చెక్కడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ ను అద్భుతంగా చెక్కించారు. అలాగే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్ కిట్, తెలంగాణకు హరితహారం వంటి వాటి లోగోలను రాతిస్తంభాలపై చెక్కించారు. సారు, కారు, సర్కారు.. భవిష్యత్ తరాలన్నింటికి తెలియడమే దీని లక్ష్యంగా కనబడుతోంది.
అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు పొందుపరిచారు. అలాగే, బతుకమ్మ వంటి పండుగలు, నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింభించేలా చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వరకు ఓకేగానీ.. ఇలా కేసీఆర్, టీఆర్ఎస్ చిత్రాలను స్తంభాలపై చెక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అయితే, అప్రమత్తమైన ఆలయ అధికారులు అష్టభుజి ప్రాకార మండపం వైపు ఎవరినీ అనుమతించడం లేదు.
ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే భవ్యమైన మందిరమని.. అది ఏ పార్టీది కాదని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. అయితే, ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలు చెక్కడం ఏంటని ఆయన ప్రశ్నించారు. యాదాద్రి ఆలయం టీఆర్ఎస్ పార్టీది కాదని, కేసీఆర్ తన జేబులోంచి తీసిన డబ్బులు ఏమీ గుడి నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం లేదని రాజా సింగ్ అన్నారు. ప్రజల సొమ్ముతోనే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాంటప్పుడు కేసీఆర్, కారు బొమ్మలు ఆలయ స్తంభాలపై ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రేపు ఆలయాన్ని తాను సందర్శిస్తానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాజా సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.
KCR statues being carved in Yadadri Temple which is the biggest temple in #Telangana
KCR Projecting Himself as God, if the statues are not removed, then the people of Telangana know how to remove @TelanganaCMO pic.twitter.com/n6f9GnGkbi
— Raja Singh (@TigerRajaSingh) September 6, 2019
ఇక ఇదే అంశమై సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఏ ఆలయాల్లో పాలకుల చిత్రాలు చెక్కలేదని, యాదాద్రిలో స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు చెక్కడం దుర్మార్గమంటూ విమర్శిలు గుప్పించారు. ఈ చర్యతో హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. ఇది ప్రభుత్వ ఆదేశాలతో జరిగితే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన చేస్తామని రేవంత్రెడ్డి హెచ్చరించారు.
ఇదిఇలా ఉంటే.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని, భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శిల్పులకు నిర్దేశించారు. అయితే, రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు తదితరాలను చెక్కాలని ముఖ్యమంత్రి సూచించారా? లేక ఆలయ శిల్పులు అత్యుత్సాహంతో వాటిని చెక్కుతున్నారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.