హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. నల్లమల అడవులను నాశనం కాకుండా కాపాడుతామని చెప్పారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వం – సీఎం శ్రీ కేసీఆర్
We will not permit any uranium mining in Nallamala forest – CM Sri KCR#SaveNallamala pic.twitter.com/lp4l8r6T7u
— TRS Party (@trspartyonline) September 15, 2019
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆంధ్రాలో తవ్వకాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతాంగానికి అన్నం పెట్టేటటువంటి కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, కింద డేల్టా కలుషితం అయ్యి నాశనం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. హైదరాబాద్కు తాగునీటిని కూడా తీసుకోలేని ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. వీటన్నింటి దృష్ట్య ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని సీఎం ప్రకటించారు. యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సభలో సోమవారం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేంద్రం వినకపోతే కలిసి ఉద్యమిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇది ఇలా ఉంటే.. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. సేవ్ నల్లమల పేరుతో రాజకీయ నాయకులు, సినీ తారలు, విద్యావేత్తలు గళమెత్తుతున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు నల్లమలను కాపాడుకొందామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. యురేనియంపై కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ లోని దాస్పల్లా హోటల్ లో జరిగే అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దీనికి రేవంత్ అంగీకరించారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులను ఇప్పటికే ఆహ్వానించారు. రేపు దాస్పల్లా హోటల్ లో జరిగే అఖిలపక్ష భేటీకి సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్, జనసేన సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.