చెన్నై: కాంగ్రెసేతర, బిజెపియేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వ్యూహాలకు పదును పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు తమిళనాట స్టాలిన్ భేటీ నిరాశే మిగిల్చింది. డిఎంకె అధినేత స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సమావేశమయ్యారు. చెన్నైలోని ఆళ్వర్పేటలోని స్టాలిన్ నివాసానికి కెసిఆర్ వెళ్లగా స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. వీరు దాదాపు గంట పాటు దేశంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంలో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను వివరించడంతో పాటు దక్షిణాది ఎంపిలు అంతా కలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చనీ, రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకోవచ్చని స్టాలిన్కు వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకంగా ఉంటే కేంద్రం నుండి సింహభాగం వాటాను దక్కించుకోవచ్చనీ, గరవ్నర్ల నియామకాల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని స్టాలిన్కు కెసిఆర్ వివరించినట్లు తెలుస్తోంది. యుపిఎలో భాగస్వామి అయిన డిఎంకె అధినేత స్టాలిన్ ఇప్పటికే రాహుల్ ప్రధాని కావాలని రెండు పర్యాయాలు బహిరంగంగా ప్రకటించిన విదితమే. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రతిపాదనలను స్టాలిన్ అంగీకరించలేదనీ, యుపిఎకే మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని తెలుస్తోంది.
ఈ విషయాన్ని డిఎంకె అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతు తెలపాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను మా నేత స్టాలిన్ ఒప్పించారు. ఇక మే 23తరువాత ప్రాంతీయ నాయకులే హీరోలు’ అని పేర్కొన్నారు.
యుపిఎలో చేరాలన్న స్టాలిన్ ప్రతిపాదనకు కెసిఆర్ తోసిపుచ్చలేదని టిఆర్ఎస్ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డిటివి పేర్కొంది.
యుపిఎ భాగస్వామ్యంగా ఉన్న స్టాలిన్తో కెసిఆర్ భేటీ గత వారం రోజులుగా దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భేటీ అనంతరం ఇద్దరు నేతలు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించకుండానే వెళ్లిపోయారు. కెసిఆర్ను మర్యాదపూర్వకంగానే స్టాలిన్ కలుసుకున్నారని డిఎంకే అధిష్టానం క్లుప్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
వీరి భేటీపై జాతీయ పత్రికలు, చానళ్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి. కెసిఆర్ ప్రతిపాదనను స్టాలిన్ తిరస్కరించడంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లుగా ఉందని పిటిఐ వ్యాఖ్యానించింది. కాగా కాంగ్రెస్ కూటమిని డిఎంకె విడిచి బయటకు వెళ్లదని టీఎన్సీసీ అధ్యక్షుడు కెఎన్ అళగిరి, బిజెపి సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి చెప్పారు. కెసిఆర్,స్టాలిన్ భేటీపై వీరు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు.
సోనియా గాంధీని విడిచి స్టాలిన్ రారనీ పేర్కొంటూ, ఆయనతో కెసిఆర్ సమావేశాన్ని అనవసరమైన చర్యగా సుబ్రమణ్యస్వామి అభివర్ణించారు. కెసిఆర్ మూడో కూటమి గురించి ప్రస్తావించినా స్టాలిన్ ఆ విషయాన్ని తోసిపుచ్చడం ఖాయమని అళగిరి అన్నారు.
వారం రోజులుగా కెసిఆర్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు.
ఏడు రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కెసిఆర్ భేటీ అయ్యారు.
ఇప్పటికే ఒక పర్యాయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పి నేత అఖిలేష్ యాదవ్ తదితరులను కలిసి ఫెడరల్ ఫ్రంట్పై చర్చించిన విషయం తెలిసిందే.
ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తొలుత ఫెడరల్ ఫ్రంట్ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్తో భేటీ అయిన సమయంలో స్వాగతిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తమ పార్టీ మద్దతు ఉంటుందని జగన్ ప్రకటించిన విషయం విదితమే.
మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో కెసిఆర్ కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా చక్రం తిప్పాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.