హుజూర్నగర్: ఎన్నో నీలాపనిందలన్నీ విశ్లేషించి హుజూర్నగర్ ఉపఎన్నికలో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో అపోహలు.. అనుమానాలు.. అపవాదులను హుజూర్నగర్ ఉపఎన్నిక పటాపంచలు చేసిందన్నారు. ఓటర్లు నీళ్లేదో, పాలేదో తెలుసుకొని గెలిపించారని కొనియాడారు. హుజూర్నగర్లో శనివారం (అక్టోబర్ 26) సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా కృతజ్ఞత’ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. హుజూర్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల, గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గ కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు.
హుజూర్నగర్ పరిధిలో ఉన్న 131 గ్రామ పంచాయతీలకు.. ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్దికి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హుజూర్నగర్ పరిధిలోని 7 మండల కేంద్రాలకు రూ.30లక్షలు మంజూరు చేస్తామన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ అభివృద్దికి రూ.25కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే నేరెడుచర్ల మున్సిపాలిటీ అభివృద్దికి రూ.15కోట్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలోనే వీటికి సంబంధించిన జీవోలు విడుదల చేస్తామన్నారు.
అలాగే చాలాకాలంగా ఉన్న హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హుజూర్నగర్ పట్టణంలో పాలిటెక్నిక్ కాలేజీతో పాటు బంజారా భవనం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల,ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. హుజూర్నగర్లో కోర్టు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రజా దర్బార్ పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక సంక్షేమ అభివృద్ది పథకాల గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అన్ని రంగాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కల్యాణలక్ష్మీ,షాదీ ముబాకర్,రైతు బంధు,రైతు భీమా,మిషన్ భగీరథ,కేసీఆర్ కిట్ వంటి అద్భుత పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్నివర్గాలను ఆదుకునే విధంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని.. కొంతమంది దీన్ని ఓర్వలేక అసంబద్ద ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివాళ్లందరికీ హుజూర్నగర్లో సైదిరెడ్డి విజయం చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తానని, రైతులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి అన్ని ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. తెలంగాణలోని కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నారు. గోదావరి నీళ్లలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పునీతం కావాలన్నారు.
కాగా, ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కే పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. దీంతో హుజూర్నగర్ లో బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు.