గుంటూరు, ఏప్రిల్ 7 : రాష్ట్ర రాజధాని అమరావతికి జిల్లా కేంద్రమైన గుంటూరు పార్లమెంటరీ సీటును ముక్కోణపు పోటీలో ఎవరు కైవసం చేసుకోనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ పార్లమెంట్ సీటుకు టిడిపి తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త. సిట్టింగ్ ఎంపి గల్లా జయదేవ్ పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులుగా వైసిపి, జనసేన పార్టీల నుండి పోటీ చేస్తున్న ఇద్దరు నాయకులు మాజీ టిడిపి నేతలు కావడం విశేషం.
2009లో నరసరావుపేట టిడిపి ఎంపిగా, తరువాత 2014లో గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా గెలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డి గత నెలలో టిడిపిని వీడి వైసిపిలో చేరారు. మోదుగుల వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, టిడిపి నుంచి టికెట్ ఆశించి భంగపడిన బి. శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ మస్తాన్ వలీ, బిజెపి అభ్యర్థిగా వల్లూరు జయప్రకాష్ నారాయణలు పోటీ చేస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో ‘మిస్టర్ పిఎం’ అంటూ ఘాటుగా, అనర్గళంగా ప్రసంగించి అటు హౌస్లోనూ, ఇటు రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ రెండవ పర్యాయం కూడా విజయం సాధించేందుకు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ అయినప్పటికీ గెలుపు ఓటములపై జనసేన ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు.
గుంటూరు పార్లమెంట్ సీటుకు ఇప్పటి వరకూ జరిగిన 16 ఎన్నికల్లో కేవలం మూడు పర్యాయాలు (1991,1999,2014) మాత్రమే టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సీటు పరిధిలో మంగళగిరి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించగా అయిదు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గెలిచారు. మంగళగిరిలో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల అధిక్యతతో గెలిచారు.
ఆ ఎన్నికల్లో పార్లమెంట్ సీటు నుండి టిడిపి అభ్యర్థిగా గల్లా జయదేవ్ వైసిపి అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై 69,222ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం, వైసిపి బలాలు పోటాపోటీగానే ఉన్నాయి.
2009 ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసిన తోట చంద్రశేఖర్కు 2లక్షల పైచికులు ఓట్లు వచ్చాయి. దీంతో నాడు కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు కేవలం 39వేల ఓట్ల ఆధిక్యతతో టిడిపి అభ్యర్థి మాదల రాజేంద్రపై విజయం సాధించారు.
ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అధినేత, ముఖ్యమంత్రి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బరిలో నిలవడంతో ఈ పార్లమెంట్ సీటుపై ప్రధాన పార్టీలు ఎక్కువగా దృష్టి సారించాయి.
ప్రధాన పోటీదారులు అందరూ ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ఒక పర్యాయం ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.