అమరావతి: రాష్ట్ర రాజధానికి కేంద్ర బిందువు అయిన కారణంగా విజయవాడ లోక్సభ స్థానంలో గెలుపోటముల అవకాశాలపై అందరి దృష్టీ పడుతోంది.
టిడిపి తరపున ఎంపి కేశినేని నాని, వైసిపి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్, కాంగ్రెస్ తరపున పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరసింహారావు, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన కిలారు దిలీప్ కుమార్ బిజెపి నుంచి, జనసేన పార్టీ తరపున ముత్తంశెట్టి లక్ష్మణ శివ ప్రసాద్ బాబులు ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టిడిపి, వైసిపి మధ్యనే ఉన్నప్పటికీ జనసేన కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకూ జరిగిన 16 ఎన్నికల్లో కేవలం ఐదు పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం తగ్గటంతో ఈ స్థానాన్ని గత ఎన్నికల్లో టిడిపి కైవసం చేసుకున్నది. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కేశినేని నాని 74 వేల పై చిలుకు మెజారిటీతో వైసిపి అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్పై విజయం సాధించారు. అప్పుడు పోటీ కేవలం టిడిపి, వైసిపి మధ్యే జరిగింది.
అయితే ప్రస్తుత ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఉండొచ్చు అనటానికి కారణం లేకపోలేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది మెజారిటీ తగ్గడానికి ఆ ఎన్నికల రంగంలో పిఆర్పి కూడా ఉండడమేనని అనుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన లగడపాటి రాజగోపాల్కు కేవలం 12 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ మాత్రమే లభించింది. 2004 ఎన్నికల్లో అదే రాజగోపాల్ ఒక లక్ష పైగా ఓట్ల ఆధిక్యతతో ఎంపిగా ఎన్నికయ్యారు . అంతే కాకుండా 2009 ఎన్నికల్లో విజయవాడ నియోజక వర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల పిఆర్పి అభ్యర్థులు గెలుపొందారు.
ఇక 2014 ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సీటు పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజక వర్గాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిడిపిలో చేరారు. అయినా ప్రతి చోటా వైసిపి గట్టి పోటీనే ఇచ్చింది.
ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి తరుపున దాదాపుగా అందరూ సిట్టింగులే బరిలో నిలిచారు. మరో కీలక నేత వంగవీటి రాధా టిడిపిలో చేరటం కూడా ఆ పార్టీకి కొంత లాభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. వైసిపి కూడా పార్లమెంట్ స్థానానికి ఆర్ధికంగా దీటైన అభ్యర్థినే బరిలో నిలిపింది. మరి రాజధానిలో ఎవరు జెండా ఎగరేస్తారో, జనసేన పార్టీ ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.