కేరళ: పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం దేశ సెక్యులర్ వ్యవస్థకు వ్యతిరేకమని, పౌరసత్వ కల్పనలో ఇది మత వివక్షను చూపేదిగా ఉందని తెలిపారు. రాజ్యాంగంలోని మౌలిక విలువలు, సూత్రాలకు ఇది విరుద్ధంగా ఉందని చెప్పారు. దేశ ప్రజల ఆందోళన దృష్ట్యా కేంద్రం దీన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సెక్యులర్ రాష్ట్రామన్న గుర్తింపు కేరళకు ఉందన్నారు. క్రైస్తవులు, ముస్లింలు ముందుగా కేరళ వచ్చినట్లు ఆయన చెప్పారు. అందర్నీ కలుపుకుని పోవడమే కేరళ సాంప్రదాయమని, ఆ సాంప్రదాయాన్ని నిలుపుకోవాలని సీఎం తెలిపారు. కేరళలో ఎటువంటి నిర్బంధ కేంద్రాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
ఈ తీర్మానాన్ని అధికార సీపీఐ (ఎం)-ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సమర్థించాయి. అయితే బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టం రద్దు తీర్మానాన్ని ఆమోదించేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీని సమావేశం నిర్వహించింది.
A special session of the Kerala Legislative Assembly was convened. The assembly passed a resolution demanding the scrapping of the #CitizenshipAmendmentAct. All main opposition parties of the assembly joined the Government in demanding the withdrawal of CAA.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) December 31, 2019
కాగా, సీఏఏను నిరసిస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళతోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు అంటున్నాయి.