(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళలను వంచించి, ఆపై బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధించి వారిని లొంగదీసుకుంటున్న ఓ యువకుడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 50 మందికి పైగా మహిళలు అతడి బారిన పడ్డారు. ఆఖరికి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రదీప్ కుమార్ను అరెస్టు చేశారు.
ఎత్తుమనూర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ కుమార్ ముందు ఫేస్బుక్ ద్వారా వివాహిత మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారి నమ్మకం సంపాదిస్తాడు. తర్వాత ఫోన్ నంబర్ తీసుకుంటాడు. చిన్నగా వారి కుటుంబం గురించి తెలుసుకుంటాడు. వారి భర్తల వివరాలు సంపాదిస్తాడు..
అప్పుడు మొదలవుతుంది ప్రదీప్ కుమార్ అసలు ఆపరేషన్. ఫేస్బుక్లో అందమైన అమ్మాయి అవతారం ఎత్తి దొంగ ఖాతాలు తెరుస్తాడు. ఆ భర్తలతో ఆన్లైన్ సరసాలు మొదలుపెడతాడు. ఆ చాటింగ్ స్క్రీన్ షాట్స్ వారి భార్యలకు పంపి వారి మధ్య కలతలు సృష్టిస్తాడు. అలా క్రమంగా మహిళకు దగ్గరయి వారిని వీడియో చాటింగ్లోకి దింపుతాడు. వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇక బ్లాక్మెయిల్ ప్రారంభిస్తాడు. అలా లొంగదీసుకుంటాడు.
తనకు లొంగిన మహిళలకు ప్రదీప్ కుమార్ ఒక్కొక్కరికి ఒక కోడ్ భాష కేటాయించాడని పోలీసులు చెప్పారు. ఆన్లైన్లో చాటింగ్కు ముందు వాళ్లు తమ కోడ్ భాష టైప్ చెయ్యాలి. అప్పుడే ప్రదీప్ లైన్లోకి వస్తాడు. ఎవరన్నా పొరపాటున అలా టైప్ చేయకపోతే బూతులు ప్రయోగించేవాడు. పోలీసులు అతని ల్యాప్టాప్ నుంచి చాలమంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసినవి సేకరించారు.