టైమ్ పత్రిక కవర్ అంటూ ప్రచారం
ఎంపీ, మాజీ క్రికెటర్ అరాచకం
మీడియాపై కీర్తి ఆజాద్ బురద
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, లోక్ సభ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ మధ్య ఒక ఫొటో ట్వీట్ చేశారు. టైమ్ పత్రిక కవర్ పేజీ మీద ప్రధాని మోదీ క్యారికేచర్ పడిందని చెప్పారు. అందులో భారతీయ మీడియా మీద బురద చల్లారు. మీడియా మొత్తం ప్రధానమంత్రి చెప్పుచేతల్లో ఉందన్నట్లుగా చూపించారు. దానికి ‘‘వాహ్.. మోదీజీ, ప్రపంచ ప్రఖ్యాత పత్రిక భారతీయ మీడియా గురించి చెప్పింది. భారతీయ మీడియాకు ప్రధాని నరేంద్రమోదీ తల్లిపాలిస్తున్నారు. ఇది వాస్తవాం కాదా? అంటూ పలు మీడియా చానళ్లను, రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.
అంతా తప్పుడుదే..
కార్టూన్ ను జాగ్రత్తగా చూస్తే, దాని కింద ఎడమవైపు మితేష్ పటేల్ అని స్టాంపు కనిపిస్తుంది. గుజరాత్ కు చెందిన పటేల్, గతంలో ఈ క్యారికేచర్ ను తయారుచేశారు. అందుకు ఆయనపై 2017లో కేసు కూడా నమోదైంది. మితేష్ పటేల్ ట్విటర్ లో ఈ కార్టూన్ ను పోస్ట్ చేయగా, దాన్ని 292 మంది రీట్వీట్ చేశారు. ఈ విషయాన్ని లక్నోకు చెందిన యూపీ మాజీ మంత్రి ఐపీ సింగ్ తెలిపారని 2017 మార్చి 2 నాటి హిందుస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. పటేల్ ఆప్, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయాడని కూడా బీజేపీ ఆరోపించింది.
2012లో లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రికలో డేవిడ్ హార్సీ వేసిన కార్టూన్ ను పటేల్ దొంగిలించారు. అందులో ఉన్న వేరే వ్యక్తి ఫొటోను మార్ఫింగ్ చేసి.. దానికి నరేంద్రమోదీ ఫొటో పెట్టారు. తల్లిపాలు తాగుతున్న బిడ్డగా భారతీయ మీడియాను చూపించారు. కీర్తి ఆజాద్ ట్వీట్ చేసిన ఫొటోలో హార్సీ అనే ఇంటిపేరు, 2012 లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక స్టాంపు కూడా ఉండటం విశేషం. ఈ విషయాలను ‘ఆల్ట్ న్యూస్’ వెబ్ సైట్ పరిశోధించింది. రిపబ్లికన్ పార్టీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వద్ద తల్లిపాలు తాగుతోందని అప్పట్లో లాస్ ఏంజెలిస్ టైమ్స్ ఓ కథనం రాసింది. దాంట్లో వాడిన క్యారికేచర్ తీసుకుని మితేష్ పటేల్ మార్ఫింగ్ చేయగా, దాన్నే టైమ పత్రిక ప్రచురించిందని కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. గతంలో బీజేపీలో ఉన్న కీర్తి ఆజాద్.. తర్వాతి కాలంలో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.