కొల్హాపూర్: భారీ వర్షాలతో వరదలను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో కొల్హాపూర్ నగరం పూర్తిగా నీటమునిగింది. ఇళ్ల కప్పులు, చెట్ల నెత్తిన కొమ్మలు తప్ప ఏమీ కనబడటం లేదు. భారీ వర్షాల కారణంగా నగరానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వేల సంఖ్యంలో నీట మునిగిన ఇళ్లు దెబ్బ తిన్నాయి. నిత్యావసర సరుకుల సరఫరా ఆగిపోయింది.
కొల్హాపూర్లో వరదల కారణంగా నలుగురు మరణించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలో 3,800కి పైగా ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికి ఉన్న వరదనీరు తీసేందుకే కనీసం మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఆధికారులు ఆందోళన చెందుతున్నారు.
కొల్హాపూర్ నగరంలోకి దారితీసే రహదారి పాక్షికంగా మునిగిపోయింది. ఫలితంగా నిత్యావసర సరుకులు తీసుకొచ్చే వాహనాలను నగరానికి 30 – 40 కిలోమీటర్ల అవతలే ఆపివేశారు. నగరం పక్కనుంచే వెళ్లే పంచగంగ నది పొంగి కొల్హాపూర్ను ముంచెత్తింది. నగరం బయట ఉన్న ఒక ఫ్లైఓవర్ పైనుంచి చూస్తే కొల్హాపూర్లో భవనాలు పైకప్పులు తప్ప మరేమీ కనబడడం లేదు.
మహారాష్ట్ర మొత్తం మీద వరదల కారణంగా 27 మంది మరణించారు. దాదాపు రెండు లక్షల మందిని వరద ముప్పు నుండి రక్షించారు. జాతీయ విపత్తు సహాయక దళంతో పాటు నౌకాదళం కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నది. పశ్చిమ మహారాష్ట్రలో అయిదు జిల్లాలు తీవ్రమైన వరదల బారిన పడ్డాయి.