విశాఖ, మార్చి 14: మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. గురువారం అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం కొణతాల వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
రేపు ఉదయం హైదరాబాద్కు ఆయన బయలుదేరనున్నారు.
లోటస్పాండ్కు వెళ్లి జగన్ను కలిసి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
కొణతాల టీడీపీలో చేరనున్నారని గత కొంత కాలంగా ప్రచారం కూడా జరిగింది.
మంత్రిగా, అనకాపల్లి ఎంపిగా బాధ్యతలు నిర్వహించి వ్యక్తిగత ఇమేజ్ కల్గి ఉన్న ఆయనకు టీడీపీలో టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
ఆయన అనూహ్యంగా వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ఇప్పటికే వైసిపిలో చేరారు.
కొణతాల కూడా వైసిపిలో చేరనున్నారనే వార్తలతో విశాఖలో రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఆసక్తిగా మారింది.
దాడి, కొణతాల ఇద్దరూ వైసీపీ నుంచి బయటికొచ్చి మళ్లీ వైసీపీ బాట పడుతున్న వాళ్లే కావడం గమనార్హం.