నాలుగు రోజులుగా ఏపీ, తెలంగాణను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ కీలక నదులు, నీటి వనరులు నిండు కుండలుగా తయారు అయ్యాయి. ఏపీలో కీలకమైన కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతుండగా, అటు తెలంగాణలో కూడా చిన్న, చితక నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తరువాత ఏపీలో వరుసగా రెండో ఏడాది కూడా వానలు అంచనాకు మించి కురుస్తుండటంతో గడిచిన ఐదేళ్ల కరువుకు ఇక స్వస్తి పడినట్లే అని రైతులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని కీలకమైన నదుల్లో నీటి ప్రవాహాలు ఎలా ఉన్నాయి అని ఒక సారి పరిశీలిస్తే..
* తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకొంది. తుంగభద్ర బోర్డు అధికారులు ప్రాజెక్టు స్పిల్ వే ఎనిమిది గేట్లు ఎత్తి తుంగభద్ర నదిలోకి నీరు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1631.62 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 110.85 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 95.60 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 49,073 క్యూసెక్కులు ఉండగా దిగువకు 6,963 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీరు సుంకేసుల ప్రాజెక్టు కు చేరుకోవడంతో డాం ఒక గేటు ఎత్తి 2800 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
* హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. అధికారులు అప్రమత్తం అయి వరద నీటిని తూముల నుండి కిందకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అటు లుంబినీ పార్క్ లోకి వరద నీరు చేరింది.
* మూసీ ప్రాజెక్టు కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు కు 6500 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో వస్తుందా 245 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 646 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 640.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 4.46టీఎంసీ లు కాగా ప్రస్తుతం 3.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి కాలువ నుండి వంద క్యూసెక్కులు, ఎడమ కాలువ నుండి వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
* ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు కు ఇన్ ఫ్లో 14,63,902క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంత మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులలో సహాయక చర్యల కోసం ఉభయ గోదావరి జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు.